అరబిందో మధ్యంతర డివిడెండు 125 శాతం

13 Nov, 2018 00:38 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మధ్యంతర డివిడెండు రూ.1.25 చెల్లించేందుకు బోర్డు సమ్మతించింది. సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో కంపెనీ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21.7 శాతం తగ్గి రూ.611 కోట్లకు పరిమితమయింది. టర్నోవరు 7 శాతం అధికమై రూ.4,751 కోట్లకు చేరింది. ఏప్రిల్‌– సెప్టెంబరు కాలంలో రూ.9,001 కోట్ల టర్నోవరుపై రూ.1,067 కోట్ల లాభం నమోదైంది. ఎబిటా 21.6 శాతంగా ఉంది. ఫార్ములేషన్స్‌ విక్రయాల్లో యూఎస్‌ 6 శాతం, యూరప్‌ మార్కెట్‌ 4 శాతం వృద్ధి చెందాయి.

అభివృద్ధికి అవకాశం ఉన్న మార్కెట్లలో ఆదాయం 26 శాతం పెరిగి రూ.307 కోట్లు నమోదు చేసింది. యాంటీ రెట్రోవైరల్‌ సేల్స్‌ 17 శాతం అధికమై రూ.244 కోట్లు, ఏపీఐ అమ్మకాలు 6 శాతం పెరిగి రూ.816 కోట్లకు చేరాయి. పరిశోధన, అభివృద్ధికి ఈ త్రైమాసికంలో రూ.217 కోట్లు ఖర్చు చేశారు. కాగా, సంస్థ అనుబంధ కంపెనీ అరబిందో ఫార్మా యూఎస్‌ఏ... అభివృద్ధి దశ లో ఉన్న ఓ ఉత్పాదన, దాని అనుబంధ ఆస్తుల కొనుగోలుకు ఆస్ట్రేలియాకు చెందిన అడ్వెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌తో ఒప్పందం చేసుకుంది. డీల్‌ విలువ సుమారు రూ.91 కోట్లు.

మరిన్ని వార్తలు