వాణిజ్యపోరులో మరీ దూరం వెళ్లొద్దు

20 May, 2019 05:48 IST|Sakshi

అమెరికాకు చైనా స్పష్టీకరణ

బీజింగ్‌: ఇరుదేశాల వాణిజ్యానికి సంబంధించి చైనాకు వ్యతిరేకంగా నష్టం కలిగించే చర్యల విషయంలో మరీ దూరం వెళ్లిపోవద్దని, పరస్పర సహకారం ద్వారానే ఇరు దేశాలూ ప్రయోజనం పొందగలవని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌పాంపియోకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ హితవు పలికారు. శనివారం పాంపియోతో టెలిఫో¯Œ లో మాట్లాడారు. అమెరిక¯Œ  కంపెనీలు విదేశీ తయారీ టెలికం ఎక్విప్‌మెంట్‌ను వినియోగించొద్దని, వీటివల్ల దేశ భద్రతకు ముప్పు అంటూ నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌ గత వారమే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాంగ్‌ నుంచి ఈ సూచన వెలువడడం గమనార్హం. చైనాకు చెందిన హువావేను లక్ష్యంగా చేసుకునే ట్రంప్‌ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వాంగ్‌ మాట్లాడుతూ.. అమెరికా ఇటీవల తీసుకున్న చర్యలు, చేసిన వ్యాఖ్యలు ఎన్నో విభాగాల్లో చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేవని, చైనా కంపెనీల కార్యకలాపాలను కూల్చే విధంగా ఉన్నాయన్నారు. మరింత ముందుకు వెళ్లొద్దని అమెరికాను కోరుతున్నట్టు చెప్పారు. వివాదాల వల్ల నష్టపోయాయని, పరస్పర సహకారంతో అమెరికా, చైనాలు లబ్ధి పొందినట్టు చరిత్ర, వాస్తవాలు తెలియజేస్తున్నాయని వాంగ్‌ గుర్తు చేశారు. పరస్పర గౌరవం, ఇరు దేశాల ప్రయోజనాల కోణంలో సహకార విస్తృతి ఆధారంగా విభేదాలను పరిష్కరించుకోవాలని కోరారు.
 

మరిన్ని వార్తలు