పెట్లుబడుల్లో చైనీస్‌ ఫోజన్‌ వెనకడుగు?!

15 Jul, 2020 13:48 IST|Sakshi

హెల్త్‌కేర్‌ రంగ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో యోచన

30 కోట్ల డాలర్ల పెట్టుబడులపై అనిశ్చితి

పలు స్టార్టప్‌లలో ఇప్పటికే పెట్టుబడులు

గ్లాండ్‌ ఫార్మాకు ప్రమోటర్‌ కంపెనీ

ఇటీవల లడఖ్‌ వద్ద సరిహద్దులో చెలరేగిన సైనిక వివాదం నేపథ్యంలో చైనీస్‌ ఫార్మా గ్రూప్‌ ఫోజన్‌ దేశీయంగా పెట్టుబడుల విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇంతక్రితం దేశీ హెల్త్‌కేర్‌ రంగంలో 30 కోట్ల డాలర్ల(రూ. 2250 కోట్లు)ను ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎపెక్స్‌ కిడ్నీకేర్‌ సంస్థతోపాటు.. బెంగళూరులోని ఓ ఆసుపత్రితో ప్రాథమిక  ప్రతిపాదనలు చేసినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. దీనిలో భాగంగా ఈ రెండు సంస్థలలో వాటాలను కొనుగోలు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా చైనా పెట్టుబడులపై అనిశ్చిత పరిస్థితులు తలెత్తడంతో వెనకడుగు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇండియాసహా వర్ధమాన మార్కెట్లు, ప్రాంతీయ మార్కెట్లలో పెట్టుబడులను కొనసాగించనున్నట్లు ఫోజన్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కంపెనీకి కీలకమైన రంగాలు, పరిశ్రమలలో కార్యకలాపాలను పటిష్టపరచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేశారు.

గ్లాండ్‌ ఫార్మా ఐపీవో
హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న గ్లాండ్‌ ఫార్మా ఇటీవల పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి దరఖాస్తు చేసుకుంది. 1978లో ఏర్పాటైన గ్లాండ్‌ ఫార్మాలో 2017లో ఫోజన్‌ ఫార్మాస్యూటికల్స్‌ మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దేశీ ప్రమోటర్ల నుంచి 74 శాతం వాటాను 110 కోట్ల డాలర్లకు సొంతం చేసుకుంది. అంతేకాకుండా డెల్హివరీ, కిస్త్‌, ఇక్సిగో, మేక్‌మైట్రిప్‌, లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్ తదితర స్టార్టప్‌లలోనూ ఇన్వెస్ట్‌ చేసినట్లు పరిశ్రమవర్గాలు వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు