ప్రభుత్వ బ్యాంకును ముంచేసిన మరో డైమండ్‌ వ్యాపారి

24 Feb, 2018 09:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి మరిన్ని కేసులు వెలుగులో  వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన వజ్రాల వ్యాపారి బుట్టలో మరో ప్రభుత్వ రంగ బ్యాంకు పడటం పలు ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది.  ఇటీవల   నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ వేల కోట్ల కుంభకోణం తాలూకు  ప్రకంపనల వేడి ఇంకా చల్లాకరముందే మరో డైమండ్‌ వ్యాపారిపై సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది.  ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌(ఓబీసీ)  రూ. 389 కోట్ల మేర మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడన్న  ఆరోపణలపై  సంస్థపైనా, డైరెక్టర్లపైనా  కేసు నమోదైంది.

ఢిల్లీకి చెందిన వజ్రాల ఎగుమతిదారుడు ద్వారకా దాస్ సేథ్  కూడా నీరవ్‌ మోదీ, చోక్సీ మోడస్‌ ఒపరాండీని ఫాలో అయ్యాడు.  అక్రమ లావాదేవీలతో  భారీ ఎత్తున   ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ కు కుచ్చుటోపీ పెట్టాడు.   ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన బ్యాంకు సీబీఐకు ఫిర్యాదు చేసింది. దీంతో  ద్వారకా దాస్ సేథ్   ఇంటర్నేషనల్‌ ప్రైవేట్ లిమిటెడ్ పై  సీబీఐ  కేసు నమోదు చేసింది. డైమండ్‌ వ్యాపారి నిరవ్ మోడీ, మెహల్ చోక్సిల  తరహాలోనే  ఓబీసీలో  2007-2012 మధ్య కాలంలో ద్వారకా దాస్  రూ.389.85 కోట్లు  మోసానికి పాల్పడ్డాడు.  ఈ నేపథ్యంలో సంస్థలోని మొత్తం డైరెక్టర్లు సభా సేథ్, రీటా సేథ్, కృష్ణ కుమార్ సింగ్, రవి సింగ్‌పై  సీబీఐ ఎఫ్‌ఐఆర్‌  నమోదు చేసింది. వీరితోపాటు  ద్వారకా దాస్ సేథ్‌ సెజ్ ఇన్‌కార్పొరేషన్ అనే మరో సంస్థను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.  కంపెనీలెటర్స్ ఆఫ్‌ క్రెడిట్  (ఎల్‌ఓసీ)ల ద్వారానే  మోసానికి పాల్పడినట్టు బ్యాంకు ఆరోపించింది. ఈ సంస్థ కూడా ఉనికిలో లేని సంస్థలపేర్లతో వ్యాపార లావాదేవీలు చేసినట్టు చెప్పింది. కాగా బ్యాంకు ఆరు నెలల క్రితమే  సీబీఐకి ఫిర్యాదు  చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు