గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌!

13 Jun, 2018 16:39 IST|Sakshi
ప్రధాన్‌ మంత్రి అవాస్‌ యోజన (ప్రతీకాత్మక చిత్రం)

పట్టణాల్లో కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అఫార్డబుల్‌ హౌజింగ్‌ స్కీమ్‌ ప్రధాన్‌ మంత్రి అవాస్‌ యోజన-అర్బన్‌(పీఎంఏఐ-యూ)లో నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ మార్పుల ప్రకారం పీఎంఏఐ-యూ కింద వడ్డీ సబ్సిడీకి అర్హత పొందిన గృహాల కార్పెట్‌ ఏరియాను 33 శాతం పెంచేందుకు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఎక్కువ మంది లబ్దిదారులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఈ కార్పెట్‌ ఏరియాను పెంచింది. పీఎంఏఐ-యూ కింద పెంచిన కార్పెట్‌ ఏరియా అన్ని మధ్య తరగతి ఆదాయ వర్గాలకు వర్తించనుంది. దీంతో మధ్యతరగతి గ్రూప్‌-1 వారి కార్పెట్‌ ఏరియా 120 చదరపు మీటర్ల నుంచి 160 చదరపు మీటర్లకు పెరిగింది. అదేవిధంగా మధ్యతరగతి గ్రూప్‌-2 వర్గాల వారి కార్పెట్‌ ఏరియా 150 చదరపు మీటర్ల నుంచి 200 చదరపు మీటర్లకు పెంచింది. 

ఎంఐజీ-1 కేటగిరీ కింద రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో ఆదాయం ఉన్నవారికి రూ.9 లక్షల రుణం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ లబ్దిదారులకు 4 శాతం వడ్డీ రాయితీలు అందుతాయి. ఎంఐజీ-2 కేటగిరీ కింద రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి రూ.12 లక్షల వరకు రుణాన్ని 3 శాతం వడ్డీ రాయితీలతో అందిస్తున్నారు. 2022 నాటికి అందరికీ గృహాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కార్పెట్‌ ఏరియా ఇంట్లో గదుల్లోని గచ్చు పరిధి వరకు విస్తరించిన ప్రాంతం. గోడలను మినహాయించి దీన్ని లెక్కిస్తారు. 

>
మరిన్ని వార్తలు