హిందాల్కో లాభం రూ.377 కోట్లు 

17 May, 2018 01:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలం(2017–18, క్యూ4)లో రూ.377 కోట్ల నికర లాభం(స్డాండెలోన్‌) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో వచ్చిన నికర లాభం, రూ.503 కోట్లతో పోల్చితే 25 శాతం క్షీణించిందని హిందాల్కో వివరించింది. మొత్తం ఆదాయం కూడా రూ.11,970 కోట్ల నుంచి రూ.11,886 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొత్తం వ్యయాలు ఎలాంటి మార్పు లేకుండా రూ.11,330 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది.

నిర్వహణ లాభం రూ.1,347 కోట్ల నుంచి 7 శాతం తగ్గి రూ.1,258 కోట్లకు తగ్గిందని తెలిపింది. నిర్వహణ మార్జిన్‌ 12.2 శాతం నుంచి 10.8 శాతానికి చేరిందని పేర్కొంది. అల్యూమినియం వ్యాపారానికి సంబంధించిన ఇబిట్‌ ఫ్లాట్‌గా రూ.920 కోట్లుగా ఉండగా, కాపర్‌ వ్యాపారం ఇబిట్‌ 34 శాతం క్షీణించి రూ.329 కోట్లకు తగ్గిందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అల్యూమినియం వ్యాపార విభాగం ఆదాయం రూ.21,089 కోట్లుగా ఉందని హిందాల్కో తెలిపింది. అలాగే రాగి విభాగం ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.22,371 కోట్లకు పెరిగిందని తెలిపింది.  రాగి ఉత్పత్తి 410 కిలో టన్నులుగా ఉందని, కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొంది. 

మరిన్ని వార్తలు