హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,795 కోట్లు

24 Jul, 2019 08:44 IST|Sakshi

14% వృద్ధి ∙6% వృద్ధితో రూ.10,197 కోట్లకు ఆదాయం  

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.1,795 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.1,569 కోట్లతో పోల్చితే 14 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. అమ్మకాలు పెరగడం, మార్జిన్ల మెరుగుదల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని హెచ్‌యూఎల్‌ సీఎండీ సంజీవ్‌ మెహతా తెలిపారు. నికర అమ్మకాలు రూ.9,616 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.10,197 కోట్లకు పెరిగాయని పేర్కొంది.విభాగాల వారీగా చూస్తే, హోమ్‌ కేర్‌ సెగ్మెంట్‌ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.3,464 కోట్లకు, బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ విభాగం ఆదాయం 4 శాతం వృద్ధివతో రూ.4,626 కోట్లకు, ఫుడ్స్‌ అండ్‌ రిఫ్రెష్‌మెంట్‌ విభాగం 9 శాతం లాభంతో రూ.1,950  కోట్లకు పెరిగాయని రామన్‌ వివరించారు. 

మెరుగుపడిన మార్జిన్లు....
కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని, పటిష్టమైన నియంత్రణ పద్ధతుల కారణంగా మార్జిన్లు పెరిగాయని హెచ్‌యూఎల్‌ సీఎండీ సంజీవ్‌ మెహతా పేర్కొన్నారు. జీఎస్‌కే కన్సూమర్స్‌ హెల్త్‌కేర్‌ను హెచ్‌యూఎల్‌లో విలీనం చేయడానికి వాటాదారులు ఆమోదం తెలిపారని, ఈ ఏడాది చివరికల్లా ఈ విలీనం పూర్తవ్వగలదని పేర్కొన్నారు.  
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హిందుస్తాన్‌ యూనిలివర్‌ షేర్‌ 0.8 శాతం లాభంతో రూ.1,693 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు