28 శాతం క్షీణించిన ఐసీఐసీఐ లాభం

26 Oct, 2019 17:49 IST|Sakshi

 క్యూ2 లో లాభం రూ. 655 కోట్లకు పరిమితం

సాక్షి, ముంబై:  ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసిక ఫలితాల్లో నష్టాలను మోదు చేసింది.  క్యూ2లో బ్యాంక్‌ నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 655 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 909 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం 26 శాతం ఎగసి రూ. 8057 కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 3994 కోట్ల నుంచి రూ. 2507 కోట్లకు క్షీణించాయి. ఇతర ఆదాయం రూ. 3156 కోట్ల నుంచి రూ. 4194 కోట్లకు చేరింది. పన్ను వ్యయాలు రూ. 346 కోట్ల నుంచి రూ. 3712 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో 13 శాతం రుణ వృద్ధిని సాధించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌  స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 6.49 శాతం నుంచి 6.9 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 1.77 శాతం నుంచి 1.74 శాతానికి నీరసించాయి. స్థూల స్లిప్పేజెస్ రూ. 2779 కోట్ల నుంచి రూ. 2482 కోట్లకు వెనకడుగు వేశాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.61 శాతం నుంచి 3.64 శాతానికి మెరుగుపడ్డాయి. కాగా ఫలితాలపై అంచనాలతో శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు 3.2 శాతం జంప్‌చేసి రూ. 469 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 471 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఫలితాల ప్రభావం దివాలీ మూరత్‌ ట్రేడింగ్‌లో కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు