ఐపీవోకు మరో రెండు కంపెనీలు రెడీ

6 Dec, 2023 07:54 IST|Sakshi

క్రియోజెనిక్‌ ట్యాంకుల తయారీ కంపెనీ ఐనాక్స్‌ ఇండియా, లగ్జరీ ఫర్నీచర్‌ కంపెనీ స్టాన్లీ లైఫ్‌స్టైల్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గతేడాది ఆగస్ట్, సెప్టెంబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. వీటి ప్రకారం ఐనాక్స్‌ ఇండియా ఐపీవోకింద 2.21 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ నిధులు ప్రమోటర్లు, వాటాదారులకు చేరనున్నాయి. మూడు దశాబ్దాలుగా ఐనాక్స్‌ ఇండియా క్రియోజెనిక్‌ ట్యాంకుల తయారీలో కార్యకలాపాలు కలిగి ఉంది. డిజైన్, ఇంజినీరింగ్, పరికరాల ఇన్‌స్టాలేషన్, క్రియోజెనిక్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు తదితర సర్వీసులు అందిస్తోంది.

రూ. 200 కోట్ల ఈక్విటీ

లగ్జరీ ఫర్నీచర్‌ను రూపొందిస్తున్న స్టాన్లీ లైఫ్‌స్టైల్స్‌ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 91.33 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నా రు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 90 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు, మరో రూ. 40 కోట్లు యాంకర్‌ స్టోర్లను తెరిచేందుకు వినియోగించనుంది. వీటితోపాటు ప్రస్తుతమున్న స్టోర్లను నవీకరించేందుకు రూ. 10 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో కొత్త మెషీనరీ, పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు రూ. 8.2 కోట్లు కేటాయించనుంది.

>
మరిన్ని వార్తలు