100 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ప్రారంభం

25 Jun, 2020 09:30 IST|Sakshi

300 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్‌

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు

బ్యాంక్‌ నిఫ్టీ 2శాతం డౌన్‌

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 334 పాయింట్లు నష్టపోయి 34534వద్ద, నిప్టీ 102 పాయింట్లను కోల్పోయి 10202 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న విక్రయాలతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయి 21వేల దిగువున 20996 వద్ద ప్రారంభమైంది.

కోవిడ్‌-19 రెండో దశ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలు పెరిగాయి. కరోనా వ్యాధి ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది దాదాపు 5 శాతం క్షీణించనున్నట్లు ఐఎంఎఫ్‌  అంచనావేసింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీ 4.5శాతం కుచించుకుపోతుందని తెలిపింది. నేడు జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడం కూడా సూచీల నష్టాల ప్రారంభానికి కారణమైంది. 

ఐఓసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌, ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4శాతం నష్టపోయింది. హిందూస్థాన్‌ యూనిలివర్‌, ఐటీసీ, బీపీసీఎల్‌, బజాజ్‌-అటో, గెయిల్‌ షేర్లు అరశాతం 2.50శాతం లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు