కియా తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

11 Oct, 2019 06:05 IST|Sakshi

‘బీట్‌ 360’ పేరుతో గురుగ్రామ్‌లో ఏర్పాటు

సెప్టెంబర్‌ దేశీ అమ్మకాలు 7,554 యూనిట్లు

గురుగ్రామ్‌: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌.. తాజాగా తన తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ‘బీట్‌ 360’ పేరుతో 5,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ, సీఈఓ కూక్‌ హున్‌ షిమ్‌ మాట్లాడుతూ.. ‘కియా భవిష్యత్‌ వ్యూహాలను ఈ సెంటర్‌ వివరిస్తుంది. భారత్‌లో నూతన ప్రామాణాలను ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర పోషించనుంది. భారత్‌లో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన దగ్గర నుంచి వినియోగదారులు మా సంస్థపైనే దృష్టి సారిస్తున్నారు.

నిజమైన కియా అనుభవాన్ని అందించడానికి వీరితో అనుసంధానం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక ఈ సెంటర్‌ పేరులోని మొదటి పదం బీటింగ్‌ ఆఫ్‌ హార్డ్‌కు సంక్షిప్తం. సంస్థ వ్యాపార ప్రాంతాలు (జోన్స్‌)కు సంకేతంగా 3, ఇంద్రియాలను సూచిస్తూ 6, హద్దులు లేవని చెప్పేందుకు 0 ఎంపిక చేసి 360 అని నిర్ణయించాం. త్వరలోనే దేశంలోని మెట్రో నగరాల్లో కూడా ఇటువంటి సెంటర్లను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నాం. అని వ్యాఖ్యానించారు.

50,000 బుకింగ్స్‌: సెప్టెంబర్‌ నెలలో కియా దేశీ అమ్మకాలు 7,554 యూనిట్లు కాగా, కారు విడుదలైన ఆగస్టు 22 నుంచి గతనెల చివరివరకు మొత్తం విక్రయాలు 13,990 యూనిట్లుగా నమోదయ్యాయి. బుకింగ్స్‌ 50,000 యూనిట్ల మార్కును అధిగమించాయి.

మరిన్ని వార్తలు