ఉద్యోగుల ఖాతాల  హ్యాకింగ్‌పై దర్యాప్తు 

17 Apr, 2019 00:21 IST|Sakshi

ఫోరెన్సిక్‌ సంస్థ నియామకం 

న్యూఢిల్లీ: తమ కంపెనీ ఉద్యోగులకు సంబంధించిన ఖాతాలు హ్యాకింగ్‌కు (అడ్వాన్స్‌డ్‌ ఫిషింగ్‌ ద్వారా) గురైనట్లు గుర్తించామని.. దీనిపై దర్యాప్తును కూడా చేపట్టామని విప్రో మంగళవారం ఫలితాల ప్రకటన సందర్భంగా వెల్లడించింది. హ్యాకింగ్‌ ప్రభావాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని కూడా తెలిపింది. దర్యాప్తులో సహకారం కోసం స్వతంత్ర ఫోరెన్సిక్‌ సంస్థను నియమించుకున్నామని విప్రో పేర్కొంది.
 

‘అడ్వాన్స్‌డ్‌ ఫిషింగ్‌ క్యాంపెయిన్‌ ద్వారా కొంత మంది ఉద్యోగుల అకౌంట్లలో అసాధారణ కార్యకలాపాలను గుర్తించాం. వెనువెంటనే దీనిపై దర్యాప్తును మొదలుపెట్టడంతో పాటు నష్ట నివారణకు తగిన చర్యలు కూడా తీసుకున్నాం’ అని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల అకౌంట్లను హ్యాకింగ్‌ చేయడం ద్వారా విప్రోకు చెందిన కొందరు క్లయింట్లపై సైబర్‌ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోందని ఉందని సైబర్‌ సెక్యూరిటీ బ్లాగ్‌ క్రెబ్స్‌ ఆన్‌ సెక్యూరిటీ పేర్కొంది.   
 

మరిన్ని వార్తలు