ఎయిర్‌టెల్‌ను టార్గెట్‌ చేసిన జియో

14 May, 2018 08:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ముకేష్ అంబానీ  అధీనంలోని  రిలయన్స్‌ జియో మరోసారి తన ప్రధాన ప్రత్యర్తి  భారతి ఎయిర్‌టెల్‌పై గుర్రుగా ఉంది.  ఉద్దేశపూర‍్వకంగా నిబంధనలు ఉల్లఘించిందని ఆరోపిస్తూ  ఎయిర్‌టెల్‌పై డాట్‌కు ఫిర్యాదు చేసింది. ఆపిల్‌  వాచ్‌ సిరీస్‌ 3లో ఉపయోగించే ‘ఈ-సిమ్‌’ సర్వీస్‌ విషయంలో ఎయిర్‌టెల్‌ లైసెన్స్‌ నిబంధనలు ఉల్లంఘించిందనేది జియో ఆరోపణ.  ఈ మేరకు మే 11 తేదీన  జియో టెలికాం శాఖకు ఒక లేఖ రాసింది.

ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 3 సర్వీస్‌ విషయంలో ఎయిర్‌టెల్‌ ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘించిందని జియో ఆరోపించింది. దీనికి సంబంధించి ఎయిర్‌టెల్‌పై  కఠినమైన చర్యలు తీసుకోవాలని.. తగిన జరిమానా విధించాలని కోరింది. ఈ-సిమ్‌’ నాడ్‌ సాంకేతికత ఇండియాలో ఏర్పాటు చేయలేదని ఇది నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందనేది  జియో వాదన.  మరోవైపు జియో వాదనలను ఎయిర్‌టెల్‌ కొట్టిపారేసింది.  దీనికి సంబంధించిన అన్ని చర్యలు  తాము చేపట్టామని తెలిపింది.  వినియోగదారుల సమాచారం, నెట్‌వర్క్‌ నాడ్స్‌ వంటి అన్ని వివరాలు అత్యంత భద్రంగా ఉండేలా ఏర్పాట్లు చేశామని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డాట్‌కు వివరిస్తామని ఆయన తెలిపారు. ఇది ఇలా ఉంటే  ఈ ఉల్లంఘన కింద, సర్కిల్‌కు  50కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని  టెలికాం నిపుణులు భావిస్తున్నారు.

ఈ-సిమ్‌  ఐఫోన్‌లోని సిమ్‌తో వైర్‌లెస్‌గా నెట్‌వర్క్‌ నాడ్‌ ‌సాయంతో కనెక్ట్‌ అవుతుంది. ఐఫోన్‌లో ఉపయోగించే నెంబర్‌నే ఆపిల్‌ వాచ్‌లోనూ ఈ-సిమ్‌ ద్వారా వినియోగిస్తూ కాల్స్‌ చేయొచ్చు. కాగా జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలు తమ అవుట్‌లెట్స్‌ ద్వారా మే 11 నుంచి ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌3 ని విక్రయిస్తున్న  సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు