రూపాయి 54 పైసలు డౌన్‌

3 Aug, 2019 10:48 IST|Sakshi

69.60కు చేరిక; డాలర్లకు మళ్లీ డిమాండ్‌

ముంబై: చమురు ధరల పెరుగుదల, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం మళ్లీ ముదురుతోందన్న ఆందోళనలు, తరలిపోతున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూపాయిపైనా గణనీయమైన ప్రభావం చూపించాయి. డాలర్లకు డిమాండ్‌ ఏర్పడడంతో శుక్రవారం డాలర్‌తో రూపాయి 54 పైసలు నష్టపోయి రూ.69.60కు చేరింది. రూపాయితోపాటు వర్ధమాన కరెన్సీలపైనా ఈ ప్రభావం పడింది. చైనాకు చెందిన 300 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులపై అదనంగా 10 శాతం టారిఫ్‌ను సెప్టెంబర్‌ 1 నుంచి విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం మరోసారి ప్రకటించడం గమనార్హం. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ఉదయం 69.26 వద్ద మొదలైన రూపాయి ఆ తర్వాత ఇంట్రాడేలో రూ.69.67 కనిష్ట స్థాయిని నమోదు చేసి చివరకు 69.60 వద్ద క్లోజయింది. రూపాయికి వరుసగా ఇది రెండో రోజు నష్టం. గురు, శుక్రవారాల్లో మొత్తం మీద డాలర్‌తో 81 పైసలు నష్టపోయింది. వారం మొత్తంమీద నికర నష్టం 71 పైసలు.

మరిన్ని వార్తలు