కనిష్ట స్థాయిలకు పడిపోయిన రూపాయి

7 May, 2018 11:40 IST|Sakshi

ముంబై : రూపాయి విలువ మార్కెట్‌లో భారీగా పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే దేశీయ రూపాయి విలువ నేడు(సోమవారం) 67 మార్కును అధిగమించి, 67.13 వద్ద ట్రేడువుతోంది. ఇది 2017 ఫిబ్రవరి నాటి అత్యంత కనిష్ట స్థాయి. అమెరికా డాలర్‌ విలువ బలపడుతుండటం, అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం రూపాయి విలువను దెబ్బతీస్తున్నాయని ఫారెక్స్‌ అడ్వయిజరీ సంస్థ ఐఎఫ్‌ఏ గ్లోబల్‌ తెలిపింది. శుక్రవారం రోజు కూడా రూపాయి విలువ 66.86గా నమోదైంది. మరోవైపు డాలర్‌ విలువ డిసెంబర్‌ నాటి గరిష్ట స్థాయిలను బద్దలు కొడుతోంది. ఆరు మేజకర్‌ కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ విలువ, డాలర్‌ ఇండెక్స్‌లో 92.609కు పెరిగింది.

అంతేకాక అంతర్జాతీయ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు మూడేళ్లలో అ‍త్యంత గరిష్ట స్థాయిలను తాకుతున్నాయి. గ్లోబల్‌గా సరఫరా చాలా కఠినతరంగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఆందోళనలతో ఆయిల్‌ ధరలు బ్యారల్‌కు 75 డాలర్ల పైగా నమోదవుతున్నాయి. దీంతో రూపాయి విలువ పడిపోతోంది. మరోవైపు దేశీయంగా కర్నాటక ఎన్నికల ప్రభావం కూడా రూపాయిపై పడుతోంది. శనివారం రోజు ఎన్నికలు జరిగి, వచ్చే మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 66.73 నుంచి 67.10 మధ్యలో ట్రేడవనుందని ఫారెక్స్‌ అడ్వయిజరీ సంస్థ తెలిపింది. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 67.085 వద్ద నమోదైంది. ప్రస్తుతం 67.13 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు