మరికొన్ని సహారా ఆస్తులూ వేలానికి సిద్ధం

10 Jun, 2016 00:43 IST|Sakshi
మరికొన్ని సహారా ఆస్తులూ వేలానికి సిద్ధం

హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీ, ఎస్‌బీఐ క్యాప్స్‌కు సెబీ అనుమతి
మరో 16 భూముల ఈ-ఆక్షన్

 న్యూఢిల్లీ: ఇబ్బందుల్లో ఉన్న సహారా గ్రూప్ పది భూ భాగాల ఈ-ఆక్షన్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, మరో 16 ల్యాండ్ పార్సిళ్ల విక్రయానికీ నిర్ణయం తీసుకుంది. వీటి రిజర్వ్ ధరను రూ.1,900 కోట్లుగా నిర్ణయించింది. సెబీ విడుదల చేసిన రెండు వేర్వేరు నోటీసుల ప్రకారం- ఎనిమిది ప్రాపర్టీలకు జూలై 13న ఎస్‌బీఐ క్యాప్స్ ఆక్షన్ నిర్వహిస్తుంది. వీటి రిజర్వ్ ధర రూ.1,196 కోట్లు. ఇక రూ.702 కోట్ల రిజర్వ్ ధర వద్ద మరో ఎనిమిది భూ భాగాలకు సంబంధించి జూలై 15న హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీ ఈ-ఆక్షన్ నిర్వహిస్తుంది.

 మొత్తం రూ.3,100 కోట్లు...
ఇంతకుముందు జారీ చేసిన నోటీసుల ప్రకారం...  హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీ జూలై 4న ఉదయం 11 గంటల నుంచీ 12 గంటల వరకూ గంటపాటు ఐదు ల్యాండ్ పార్మిళ్లకు సంబంధించి ఈ-ఆక్షన్‌ను నిర్వహించనుంది. రిజర్వ్ ధర రూ.722 కోట్లు. ఎస్‌బీఐ క్యాప్... జూలై 7న ఉదయం 10.30 నుంచి 11.30 వరకూ ఐదు ల్యాండ్ పార్సిల్స్‌కు సంబంధించి ఈ-ఆక్షన్ జరుగుతుంది. రిజర్వ్ ధర రూ.470 కోట్లు.  ప్రస్తుత, గత రిజర్వ్ ధరలు దాదాపు రూ. 3,100 కోట్లు.

తరువాత మిగిలిన ఆస్తుల వేలం...
31 ల్యాండ్ పార్సిళ్లను రూ.2,400 కోట్లకు విక్రయించడానికి హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీకి సెబీ అనుమతి ఉంది. ఇక ఎస్‌బీఐ క్యాప్ విషయంలో 30 ల్యాండ్ ప్రాపర్టీల అమ్మకాలకు అనుమతి ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆ ఆస్తుల వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.4,100 కోట్లు. మిగిలిన ఆస్తుల ఈ- విక్రయానికి మరోసారి నోటీసులు వెలువడనున్నాయి.

మరిన్ని వార్తలు