మళ్లీ మ్యాట్ భయాలు

27 May, 2015 06:28 IST|Sakshi
మళ్లీ మ్యాట్ భయాలు

మ్యాట్ ఆందోళన మళ్లీ తెరపైకి రావడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల పాలైంది. దీనికి  కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం కూడా జతవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 112 పాయింట్లు నష్టపోయి 27,531 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 8,339 పాయింట్ల వద్ద ముగిశాయి.  రిఫైనరీ, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు పతనమయ్యాయి. రూపాయి క్షీణించడం, మే డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపుకు రావడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు పొజిషన్లను తగ్గించుకున్నారని ట్రేడర్లు పేర్కొన్నారు. 30 షేర్ల సెన్సెక్స్‌లో 17 షేర్లు నష్టపోయాయి.  

1,497 షేర్లు నష్టాల్లో, 1,157 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,436 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో, రూ. 14,363కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ. 3,02,273కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 115 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.124 కోట్ల చొప్పున నికర కొనుగోళ్లు జరిపారు.

>
మరిన్ని వార్తలు