ముంబై: దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదాయాలపరంగా టాప్ ఉన్న అతిపెద్ద సంస్థ టాటా మోటార్స్ ఉద్యోగులకు ర్యాంకింగ్ల పద్ధతికి స్వస్తి పలకనుంది. ఇకపై తన కంపెనీ ఉద్యోగులను డిజిగ్నేషన్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తన ఉద్యోగులకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రశంసనీయ సంస్థను సృష్టించేందుకు, ఉద్యోగుల్లో సృజనాత్మకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా నిర్ణయం ప్రకారం జనరల్ మేనేజర్, సీనియర్ జనరల్మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తదితర హోదాలను ఇక మీదట రద్దు కానున్నాయి. తద్వారా ఉద్యోగి బాధ్యత బలోపేతం కావడంతో , వారి పనితీరు ట్రాకింగ్ ప్రక్రియను పారదర్శకం చేస్తుందని కంపెనీ భావిస్తోంది.
ఈ నిర్ణయంతో దాదాపు 10వేల ఉద్యోగులపై ప్రభావం పడనుందని సంస్థ సీనియర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో ఉద్యోగులు హోదా మీద కాకుండా పని మీద దృష్టి పెట్టగలరని భావిస్తున్నామని చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ గజెండ ఎస్. చందేల్ చెప్పారు. అలాగే సాధారణ ప్రమోషన్ల నుంచి దూరంగా ఉండటానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. ఉద్యోగి బాధ్యత బలోపేతం కావడం మరియు ఇది పనితీరు ట్రాకింగ్ ప్రక్రియను పారదర్శకం, సరళం చేస్తుందని పేర్కొన్నారు.
ఇకనుంచి కొత్త బిజినెస్ కార్డులు ఉద్యోగి పేరుతో ఉంటాయి. ఫంక్షన్ లేదా స్పెషలైజేషన్, ప్రాంతం ఆధారంగా , 'సేల్స్- మీడియం, హెవీ వాణిజ్య వాహనాలు'లాంటి హోదాలతో ఉండనున్నాయి. అయితే ఈ నిర్ణయంపై ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పాత ఉద్యోగుల కంటే యువ ఉద్యోగులు ఎక్కువ ఉత్సాహంతో స్పందించినట్టు సమాచారం.