120 కోట్లు దాటిన  టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య

21 Mar, 2019 01:00 IST|Sakshi

జనవరి వృద్ధిరేటు 0.49 శాతం..

న్యూఢిల్లీ: టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఈ ఏడాది జనవరిలో మరోసారి 120 కోట్ల మార్కును అధిగమించింది. ఈ మార్కును మించి సబ్‌స్క్రైబర్లు జతకావడం ఇది మూడవసారని టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. 2017 జూలై, 2018 మే తరువాత 120 కోట్లు మార్కును చేరడం ఇదే తొలిసారి. గతేడాది డిసెంబర్‌లో నమోదైన మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 119.7 కోట్లు కాగా, ఈ జనవరిలో 0.49 శాతం వృద్ధి నమోదైంది.

రలయన్స్‌ జియో ఈ కాలంలో కొత్తగా 93 లక్షల నూతన కస్టమర్లను జతచేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 9.82 లక్షలు, భారతీ ఎయిర్‌టెల్‌ లక్ష కొత్త యూజర్లను సొంతం చేసుకున్నాయి. ఇక వొడాఫోన్‌ ఐడియా 35.8 లక్షల కస్టమర్లను కోల్పోగా.. టాటా టెలీసర్వీసెస్‌ 8.4 లక్షల యూజర్లను కోల్పోయింది. మరోవైపు దేశీ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు 4.15 శాతం వృద్ధితో 54 కోట్లకు చేరుకున్నాయి.  
 

మరిన్ని వార్తలు