లండన్: బ్యాంకులకు రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకి చెందిన విహార నౌక ‘ఇండియన్ ఎంప్రెస్’ను మాల్టాలో ట్రేడ్ యూనియన్ స్వాధీనం చేసుకుంది. నౌక నిర్వహణ వ్యయాలు, సిబ్బందికి జీతభత్యాలు దాదాపు పది లక్షల డాలర్ల మేర మాల్యా బకాయి పడటంతో నాటిలస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ నౌకను తమ అధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. గతేడాది సెప్టెంబర్ నుంచి దీని వైపు చూడటం మానేసిన మాల్యా... జీతభత్యాల గురించి సిబ్బంది చేసిన అభ్యర్ధనలను కూడా పట్టించుకోవడం లేదని, దీంతో నౌక స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని నాటిలస్ తెలిపింది.
విలాసవంతమైన ఈ విహార నౌకను 2006లో కొనుగోలు చేసిన మాల్యా.. లక్షల డాలర్లు వెచ్చించి దానికి మరిన్ని హంగులు తీర్చిదిద్దారు. 40 మంది పైగా సిబ్బంది దీనిలో పనిచేస్తుండగా.. వీరిలో కొందరు భారతీయులూ ఉన్నారు.