12 సంవత్సరాల 9 నెలల శిక్ష విధించిన యూకే కోర్టు

30 May, 2020 12:40 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా 24 కంపెనీలను మోసం చేసిన నిందితులు

లండన్‌: 2.4 మిలియన్‌ పౌండ్ల(భారత కరెన్సీలో రూ. 22,38,67,680.00) భారీ హవాలా నేరానికి పాల్పడినందుకు గాను శుక్రవారం యూకే కోర్టు భారత సంతతి వ్యక్తులు ఇద్దరికి కలిపి 12 సంవత్సరాల 9 నెలల జైలు శిక్ష విధించింది. స్కాట్లాండ్ యార్డ్ ఎకనామిక్ క్రైమ్ యూనిట్ దర్యాప్తు ఆధారంగా కోర్టు  విజయ కుమార్ కృష్ణసామి (32), చంద్రశేఖర్ నలయన్ (44)కు శిక్ష విధించింది. నేరపూరిత ఆస్తులను దాచడం, బదిలీ చేయడం వంటి నేరాల కింద కోర్టు విజయ కుమార్ కృష్ణసామికి ఐదేళ్ళ తొమ్మిది నెలలు, చంద్రశేఖర్ నలయన్‌కు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

వీరిద్దరు ఇప్పటికే 2.4 మిలియన్‌ పౌండ్ల మనీలాండరింగ్‌కు పాల్పడటమే కాక మరో 1.6 మిలియన్‌ పౌండ్ల(భారత కరెన్సీలో రూ.14,92,45,120.00) మనీలాండరింగ్‌ ప్రయత్నంలో ఉన్నారని ఎకనామిక్ క్రైమ్ యూనిట్ పోలీసులు తెలిపారు. ఈ సందర్బంగా డిటెక్టివ్‌ కానిస్టేబుల్‌ మిలేనా బింగ్లీ, మాట్లాడుతూ.. ‘ఇది సంక్లిష్టమైన కేసు. బ్యాంకింగ్ రంగంలోని మా భాగస్వాములు, సైబర్ డిఫెన్స్ అలయన్స్(సీడీఏ) వారి సహకారంతో వీరిని పట్టుకోగలిగాము. అయితే ఇది 2018 నాటి కేసు. దక్షిణ లండన్‌లోని క్రోయిడాన్ క్రౌన్ కోర్టు బార్క్లేస్ బ్యాంక్ అధికారులు మొదటి సారి వీరి మీద ఫిర్యాదు చేశారు’ అని బింగ్లీ తెలిపారు.

వేరువేరు ఐపీ అడ్రస్‌ల ద్వారా తమ బ్యాంక్‌లోని పలు బిజినెస్‌ అకౌంట్లను నిందితులిద్దరు యాక్సెస్‌ చేసి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారని బింగ్లీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎకనామిక్ క్రైమ్ యూనిట్‌.. సీడీఏతో కలిసి ‘ఆపరేషన్ పాల్కాల్లా’ను ప్రారంభించింది అన్నారు. ఈ క్రమంలో  అనుమానిత ఐపీ అడ్రెస్‌లను ట్రేస్‌ చేసి దర్యాప్తు ప్రారంభించి.. చివరకు నిందితులను పట్టుకున్నామని బింగ్లీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 24 కంపెనీలు వీరి చేతిలో మోసపోయాయి అన్నారు. నిందితులిద్దరు ఈ హవాలా సొమ్మును యూకే దాటించారని.. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోలేము అన్నారు బింగ్లీ..

మరిన్ని వార్తలు