యూపీలో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

11 Jan, 2020 07:00 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్‌ జిల్లాలోని చిబ్రమౌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు, డీజిల్‌ ట్యాంకర్‌ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని చిలోయి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది సజీవదహనమైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలియగానే, పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు. 21 మందిని రక్షించి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని ఐజీపీ మోహిత్‌ అగర్వాల్‌ తెలిపారు. మంటలను అదుపుచేశామని, సహాయచర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రమాద  సమాచారం తెలియగానే సీఎం ఆదిత్యనాథ్‌ తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.

మరిన్ని వార్తలు