ఢిల్లీ పాఠశాలలో దారుణం

11 Aug, 2018 02:37 IST|Sakshi
ఘటన జరిగిన స్కూలు వద్ద ఢిల్లీ పోలీసుల బందోబస్తు

ఆరేళ్ల బాలికపై స్కూల్‌లోనే ఎలక్ట్రీషియన్‌ అత్యాచారం

నిందితుడి అరెస్టు

న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఖరీదైన గోలే మార్కెట్‌ ప్రాంతంలోని న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ (ఎన్‌డీఎంసీ) ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై ఓ ఎలక్ట్రీషియన్‌ రామ్‌ ఆశ్రయ్‌ (37) స్కూల్‌ ఆవరణలో రేప్‌ చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎలక్ట్రీషియన్‌ను అరెస్టుచేసి జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు. 20 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేస్తామని పోలీసులు చెప్పారు.

కాగా, రేప్‌ చేసిన రామ్‌తోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మరో ముగ్గురిని ఎన్‌డీఎంసీ సస్పెండ్‌ చేసింది. రామ్‌ ఆశ్రయ్‌ పై అధికారి, జూనియర్‌ ఇంజినీర్‌ అయిన సౌరభ్‌ బిష్ట్‌ ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తుండగా ఆయన ఒప్పందాన్ని ఎన్‌డీఎంసీ రద్దు చేసి ఉద్యోగం నుంచి తొలగించింది. సస్పెండైన వారిలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంతోష్, విద్యుత్తు విభాగ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ తులసి, ఉపాధ్యాయిని శిఖ ఉన్నారు.  మహిళలపై నేరాలను అడ్డుకునేందుకు కేంద్రం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు.  

భద్రతా చర్యలేంటో చెప్పండి..
పాఠశాలలో పిల్లల భద్రత కోసం తీసుకున్న చర్యలేంటో చెప్పాల్సిందిగా డీసీడబ్ల్యూ పోలీసులతోపాటు స్కూల్‌ అధికారులకు నోటీసులిచ్చింది. ఎన్‌హెచ్చార్సీ ఈ ఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులకు నోటీసులిచ్చింది. నిందితుడు తమ స్కూల్‌ ఉద్యోగి కాదనీ, ఎన్‌డీఎంసీ ఉద్యోగిగా ఇక్కడ పనిచేయడానికి మాత్రమే వచ్చాడని పాఠశాల వర్గాలు చెప్పాయి. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల బయట ఆందోళనకు దిగి, ఈ స్కూల్‌లో తమ పిల్లలకు భద్రతేముందని ప్రశ్నించారు. టీచర్లు,  సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చూపారన్నారు.

ఇంటికి వెళ్తుండగా పిలిచి..
ఎన్‌డీఎంసీలో శాశ్వత ఉద్యోగి అయిన రామ్‌ 2 నెలలుగా స్కూల్లో విద్యుత్తు పనులు చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం స్కూల్‌ అయిపోయాక ఇంటికెళ్తున్న బాలికను పిలిచి పంపు రూంలోకి  తీసుకెళ్లి రేప్‌చేశాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. పాప ఇంటికి వెళ్లిన అనంతరం ఆమె మర్మాంగాల నుంచి రక్తం కారుతుండటాన్ని గమనించిన బాలిక తల్లి.. వెంటనే ఆమెను వైద్యశాలకు తీసుకెళ్లింది. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు తేల్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుణ్ని పోలీసులు అరెస్టుచేసి విచారణచేపట్టారు.
 

మరిన్ని వార్తలు