విషపూరిత మద్యం: 80కి చేరిన మృతులు

23 Feb, 2019 17:11 IST|Sakshi

డిస్‌పూర్‌ : అస్సాంలో విషపూరిత మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 80కి చేరింది. మృతుల్లో గోలాఘాట్‌కు చెందిన వారే 39 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరే కాక మరో 300 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేడుకలో భాగంగా తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు ఈ కలుషిత మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

రెండు రోజుల క్రితం గోలాఘాట్‌లోని సల్మారా టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న కూలీలు రాత్రి వేడుక చేసుకున్నారు. దానిలో భాగంగా సంజు ఒరాంగ్‌ అనే కూలి మద్యం తీసుకొచ్చారు. ఆ మద్యం సేవించిన కాసేపటికే ఇద్దరు మహిళలు కుప్పకూలారు. దాంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషపూరిత మద్యం తీసుకోవడం వల్లే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాటికి మృతుల సంఖ్య 84కు చేరుకుంది. ఈ ఘటనలో మద్యం అమ్మిన వ్యక్తి సంజు ఒరాంగ్‌, అతడి తల్లికూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

తేయాకు తోటల్లో పనిచేసే వారికి వారానికోసారి కూలీలు ఇస్తుంటారు. ఈ క్రమంలో వారికి గురువారం కూలీలు అందాయి. దాంతో పెద్ద ఎత్తున కూలీలు అక్కడకు చేరుకుని వేడుకలు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు వేడుకలో భాగంగా ఈ కలుషిత మద్యం సేవించడం వల్లనే ఘటన జరిగినట్లు స్థానిక పోలీస్‌ అధికారి పుష్‌రాజ్‌ సింగ్‌ తెలిపారు. రసాయనాలు కలిగిన క్యాన్‌లో మద్యం తీసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కల్తీ మద్యం కారణంగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో 97 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు