కర్నూలు,బొమ్మలసత్రం: పెళ్లి కుదిర్చినందుకు కమీషన్ ఇవ్వకపోవటంతో పెళ్లిళ్ల పేరమ్మ నవవరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్లో నివాసముంటున్న షేక్ హుసేన్బాషా చిరువ్యాపారం చేసేవాడు. హుసేన్బాషా వివాహం చేసుకునేందుకు సంబంధాలు చూస్తుండగా పెళ్లిళ్ల పేరమ్మ ఖాజాబీతో పరిచయం ఏర్పడింది. హుసేన్బాషాకు పోలూరు గ్రామంలో రైతుకుటుంబానికి చెందిన ఓ యువతితో వివాహం కుదర్చటంతో ఏడు నెలల క్రితం వివాహం జరిగింది.
పెళ్లి జరిగిన సమయంలో కొంత నగదును ఖాజాబీకి ఇచ్చాడు. అది సరిపోదంటూ రూ.10 వేలు కావాలంటూ ఖాజాబీ డిమాండ్ చేసింది. తన వద్ద అంత డబ్బు లేదంటూ హుసేన్బాషా పేరమ్మతో చెప్పి మూడురోజుల క్రితం భార్యతో కలిసి పోలూరు గ్రామానికి వెళ్లాడు. గురువారం ఉదయం ఖాజాబీ పోలూరు గ్రామం వెళ్లి డబ్బు ఇవ్వాలంటూ హుసేన్బాషాతో గొడవకు దిగింది. ఈక్రమంలో అక్కడే ఉన్న కర్రతో హుసేన్బాషా తలపై దాడి చేసింది. గాయపడిన బాధితున్ని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఖాజాబీపై రూరల్పోలీసులకు ఫిర్యాదు చేశాడు.