యువకుడిపై కత్తులతో దాడి

21 Apr, 2018 11:06 IST|Sakshi
హరిప్రసాద్‌ (ఫైల్‌) సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఏసీపీ నాగేశ్వరరావు   

కొమ్మాది(భీమిలి) : భీమిలి రూరల్‌ మండలం చేపలుప్పాడ పంచాయతీ చిన ఉప్పాడలో ముగ్గురు వ్యక్తులు ఒక యువకుడిపై గురువారం రాత్రి కత్తులతో దాడి చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... ఇదే ప్రాంతానికి చెందిన చెన్నా హరి ప్రసాద్‌ (25) ఇంట్లో గురువారం ఇంటి అమ్మవారి పండుగ చేశారు. రాత్రి వరకు బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎవరూ లేని సమయంలో చిన ఉప్పాడ రచ్చబండ సమీపంలో హరిప్రసాద్‌పై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు.

అక్కడ పడి ఉన్న హరిప్రసాద్‌ను స్థానికులు గుర్తించి హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. శుక్రవారం ఏసీపీ నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తనపై తమ ప్రాంతానికి చెందిన చార్లెస్, రాంబాబు, నరేష్‌ అనే ముగ్గురు దాడి చేసినట్టు హరిప్రసాద్‌ పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన సంఘటనపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హరిప్రసాద్‌ చెప్పినట్టు వారు ఎందుకు దాడిచేశారు, కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు