వీడి పైశాచికత్వం తగలెయ్య...

13 Jul, 2018 20:53 IST|Sakshi

భోపాల్‌ : ఓ పైశాచిక ప్రేమికుడు తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని యువతితో పాటు ఆమె తల్లిదండ్రులను వారి ఇంటిలోనే బంధించాడు. కాపాడాటానికి వచ్చిన పోలీసులను ఒక స్టాంప్‌ పేపర్‌, ఫోన్‌ చార్జర్‌ కావాలని వింత కోర్కెలు కోరుతున్నాడు. వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్‌ ముంబైలో చిన్నపాటి మోడల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి అదే రంగంలో పనిచేస్తున్న భోపాల్‌కు చెందిన ఒక మోడల్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రోహిత్‌ ఆ మోడల్‌ని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దాంతో రోహిత్‌ ఆమెని వేధించటం ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న మోడల్‌ తల్లిదండ్రులు రోహిత్‌ మీద పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో అతన్ని అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన రోహిత్‌ తిరిగి ఆ మోడల్‌ని వేధించడం ప్రారంభించాడు.

ఈ ‍క్రమంలో ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో మోడల్‌ ఇంట్లో ప్రవేశించి, తాళం వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ రోహిత్‌ దగ్గర మోడల్‌ బందీగా ఉండటంతో వెంటనే చర్యలు తీసుకోలేకపోతున్నారు. పోలీసులు వచ్చారని తెలుసుకున్న రోహిత్‌ వీడియో కాల్‌ ద్వారా తమతో మాట్లాడుతున్నాడని పోలీస్‌ అధికారులు తెలుపుతున్నారు. వీడియో కాల్‌ చేసినప్పుడు అతని దగ్గర ఒక తుపాకీ ఉన్నట్లు, యువతి చుట్టూ రక్తం ఉన్నట్లు గమనించామన్నారు.

అందుకే ఈ వ్యవహారంలో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు పోలీసులు. అయితే మోడల్‌ తనను వివాహం చేసుకుంటానని చెప్పిందని అందుకే తాను ఆమె ఇంటికి వచ్చినట్లు రోహిత్‌ పోలీసులకు తెలిపాడు. యువతితో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా రోహిత్‌ నిర్భందించాడు. వీరిని ఇంటిలో నిర్భందించి ఇప్పటికే 12 గంటలు దాటింది. ఇంటిలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు