తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య 

9 Nov, 2018 01:31 IST|Sakshi

సత్తుపల్లి రూరల్‌: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం 15వ ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్‌లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూజారిగూడెంకు చెందిన పూనెం శ్రీనివాస్‌(35) 15వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం చర్ల మండలం గన్నవరంపాడుకు చెందిన రాధతో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడున్నాడు. శ్రీనివాస్‌ భార్యాను పట్టించుకోకపోవడంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శ్రీనివాస్‌ భార్య రెండేళ్ల నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. శ్రీనివాస్‌ ఏడాదిగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది.

2 రోజుల క్రితం వీరి మధ్య గొడవలు జరగడంతో ఆమెపై శ్రీనివాస్‌ చేయి చేసుకోవడంతో ఆమె తరఫు బంధువులు 100 నంబర్‌కు డయల్‌ చేసి ఫిర్యాదు చేశారు. బుధవారం శ్రీనివాస్‌ డ్యూటీలో ఉండగా, సుమారు అరగంటపాటు ఆ మహిళతో ఫోన్‌లో మాట్లాడి.. ‘నేను తుపాకీతో కాల్చుకొని చనిపోతున్నా.. మా బాబును మంచిగా చూసుకోండి’అని.. సెల్‌ఫోన్‌ ద్వారా మెసేజ్‌ పెట్టాడు. ఇది చూసిన ఆమె బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ స్నేహితుడికి సమాచారం అందించింది. వెంటనే అతనెక్కడ విధులు నిర్వహిస్తున్నాడో తెలుసుకొని అక్కడికి చేరుకునేలోపే మెడ కింది భాగంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై స్థానిక ఏఐ డేవిడ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు