ప్రముఖ కబడ్డీ ప్లేయర్‌ను కాల్చి చంపిన పోలీసు

9 May, 2020 14:53 IST|Sakshi

కారు పార్కింగ్‌ గొడవే కాల్పులకు కారణం!

చండీగఢ్ :  కారు పార్కింగ్‌లో గొడవ జరిగి ప్రముఖ కబడ్డీ ఆటగాడిని ఓ పోలీసు అధికారి కాల్చి చంపిన ఘటన పంజాబ్‌లోని కపుర్తాలా జిల్లాలో చోటు చేసుకుంది. మృతి చెందిన కబడ్డీ ప్లేయర్‌ అర్విందర్‌ జీత్‌ సింగ్‌గా గుర్తించారు. కాగా, కాల్పులకు పాల్పడిన ఏఎస్సై పరమ్‌జీత్‌ సింగ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అసలు ఏం జరిగిందంటే..
పంజాబ్‌కు చెందిన ప్రముఖ కబడ్డీ ప్లేయర్‌ అర్విందర్‌ జీత్‌ సింగ్‌ గురువారం రాత్రి తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్(ఎస్‌యూవీ) కారులో రైడింగ్‌కు వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు ఓ రోడ్డు పక్కన వారి కారును పార్క్ చేసి అందులోనే కూర్చొని ఉన్నారు. ఇదే సమయంలో... మరో ఎస్‌యూవీలో ఏఎస్సై పరంజీత్‌సింగ్‌ అటుగా వచ్చాడు. ఇక్కడ ఎందుకు పార్కింగ్‌ చేశారు? అని అర్విందర్‌ను ప్రశ్నించారు. దీనికి అర్విందర్‌ సమాధానం చెప్పకుండా కారును స్టార్ట్‌ చేసి స్పీడ్‌గా దూసుకెళ్లాడు. దీంతో ఏఎస్సైకి అనుమానం వచ్చి వారి కారును ఛేజింగ్‌ చేశారు. 

అర్విందర్‌ సింగ్‌(ఫైల్‌ ఫోటో)
పోలీసులు వదలట్లేదని భావించిన అర్విందర్‌... ఓ చోట కారు ఆపి తనతోపాటూ కారులో ఎవరెవరు వచ్చారో చెప్పడానికి వెనక్కి తిరిగాడు. ఇంతలో తన వెహికిల్ నుంచి కిందకు దిగిన ఏఎస్సై... అర్విందర్‌పై కాల్పులు జరిపాడు.దీంతో అర్వింద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.  పక్కనే ఉన్న మరో స్నేహితుడు ప్రదీప్‌ సింగ్‌కి గాయాలయ్యాయి. వెంటనే అతని ఫ్రెండ్స్... కారు దిగి... ఫైరింగ్ ఆపమని వేడుకున్నారు. దాంతో ఏఎస్సై ఆగాడు. ఆ తర్వాత అదే వెహికిల్‌‌లో అర్విందర్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. కాగా, అర్విందర్‌ స్నేహితుల ఫిర్యాదు మేరకు ఏఎస్సైపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు