సీఆర్పీఎఫ్‌ జవాను ఆత్మహత్య

8 Jul, 2019 10:41 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబ సభ్యులు, మృతిచెందిన గోపీనాథ్‌ (ఫైల్‌) 

సాక్షి,  నల్లజర్ల(పశ్చిమగోదావరి) : నల్లజర్ల మండలం ముసుళ్లగుంట బామ్మచెలకకు చెందిన సీఆర్పీఎఫ్‌ జవాను మానుకొండ గోపినాథ్‌ (28) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి సంజీవరావు అనారో గ్యంగా ఉన్నాడన్న సమాచారంతో మేఘాలయలో పనిచేస్తున్న అతడు ఈ నెల 4న సెలవుపై గ్రామానికి వచ్చాడు. సంజీవరావు అప్పులపాలయ్యాడని ఆ అప్పుల బాధ తాళలేక కుటుంబం ఇబ్బందుల పాలైందని ఈ విషయంపై కుటుంబంలో గత రెండురోజులుగా స్వల్ప వివాదం తలెత్తింది. ఈ కారణంగా మనస్తాపం చెందిన గోపినాథ్‌ శనివారం మధ్యాహ్నం తమ సొంత పొలంలోనే పురుగుల మందు తాగాడు.

ఈ విషయం గమనించిన స్థానికులు తాడేపల్లిగూడెం, అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు నల్లజర్ల ఎస్సై కె.చంద్రశేఖర్‌ తెలిపారు. ఆదివారం శవపంచనామా నిర్వహించారు. సాయంత్రం ముసుళ్లగుంటలో అంత్యక్రియలు జరిగాయి. కొడుకు అకాలమృతితో తల్లిదండ్రులు సంజీవరావు, జయకుమారి, అక్కలు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మూడేళ్ల క్రితం తమ సోదరుడు ఆర్మీలో చేరాడని మృతుడి అక్కలు శ్రీదేవి, పుష్పవేణి వివరించారు. ఆర్మీ అధికారులు ఆదివారం రాత్రి ముసుళ్లగుంటకు వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.  

మరిన్ని వార్తలు