మీరు హాస్టల్­లో ఉంటున్నారా? కచ్చితంగా చదవండి!!

28 Oct, 2019 20:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతా యంగ్ అండ్ ఎనర్జిటిక్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు.. సైబర్ నేరాలపై పూర్తి అవగాహన ఉన్నవాళ్లు. ఎవరైనా ఫోన్ చేసి బంపర్ లాటరీ తగిలిందనో.. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం ఓటీపీ చెప్పండనో అడిగితే అడిగిన వాళ్ల తాట తీసేంత టెక్నాలజీ తెలిసిన వాళ్లు. కానీ సైబర్ నేరాలకు బాధితులుగా మారారు. తమ ప్రమేయం లేకుండా లక్షల రూపాయలు పోగొట్టుకొని ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.. అసలు వాళ్లు ఎలా మోసపోతున్నారు. సిటీల్లో మొదలైన ఈ కొత్తతరహా మోసాన్ని హాస్టళ్ల జీవితాలు గడిపే వాళ్లంతా కచ్చితంగా చూసి తీరాలి.

మీరు హాస్టల్­లో ఉంటున్నారా..? అయితే మీకు మాత్రమే విడిగా రూమ్ ఉండేలా చూసుకోండి. పొరపాటున కూడా మరొకరితో రూమ్ షేర్ చేసుకోకండి. ఒకవేళ రూమ్ షేర్ చేసుకోకతప్పకపోతే మీరూ బాధితులు కావొచ్చు ఈ కార్తీక్ లాగా... ! చెన్నైకి చెందిన కార్తిక్ హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. మూడేళ్లుగా మాదాపూర్లోని సెరెన్ హాస్టల్ లో ఉంటున్నాడు. అది షేరింగ్ రూమ్. ఈ నెల 17న కార్తీక్ ఉంటున్న హాస్టల్ రూమ్ లో పక్కబెడ్ పై ఓ కుర్రాడు వచ్చి స్టే చేసి వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తర్వాత కార్తీక్  ఫోన్‌లోని సిమ్ కార్డు పని చెయ్యలేదు. ఫోన్ తీసి చూస్తే సిమ్ కార్డ్ కరెక్టుగానే ఉంది. కానీ ఎందుకు వర్క్ చెయ్యలేదో అర్థం కాలేదు. కార్తీక్ దగ్గర మనీ వాలెట్.. క్రెడిట్, డెబిట్ కార్డ్స్ అన్నీ ఉన్నాయ్.. జస్ట్ ఫోన్ పని చెయ్యలేదంతే. వెంటనే మొబైల్ రిపేర్ షాప్­కి వెళ్లాడు.. అప్పుడు తెలిసింది తాను ఆ సిమ్ కార్డు పనిచెయ్యని కారణంగా ఏకంగా రెండు లక్షల రూపాయలు మోసపోయినట్లు..

సిమ్ కార్డు ఎందుకు పనిచెయ్యలేదు? సిమ్ కార్డుకూ పోయిన డబ్బుకీ ఏంటి సంబంధం? కార్తీక్ ఫోన్‌లో సిమ్ కార్డ్ ఉంది. కానీ అది అసలైనది కాదు. డమ్మీ సిమ్. సైబర్ కేటుగాడు హాస్టల్‌లో స్టే చేసిన రెండు రోజులు కార్తిక్‌పై నిఘా ఉంచాడు. కార్తిక్ నెట్ బ్యాంకింగ్ వాడుతున్నాడని గమనించాడు. హాస్టల్ ఖాళీ చేసి రోజు రాత్రి.. కార్తీక్ మొబైల్‌ లోని సిమ్ దొంగలించాడు. వాలెట్‌లోని డెబిట్, క్రిడిట్ కార్డులను ఫోటో తీసుకున్నాడు. వెళ్తూ వెళ్తూ కార్తిక్ ఫోన్‌ను నీళ్లలో పడేసి..పనిచేయకుండా చేసాడు. కార్తిక్ సిమ్ ఉపయోగించి...నెట్ బ్యాంకింగ్ ద్వారా రెండు రోజుల్లోనే రెండు లక్షలు కాజేశాడు.

హాస్టల్‌లో ఉన్న సీసీటీవీలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. హాస్టల్ నిర్వాహకులు అతని నుండి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు తీసుకోలేదని తెలిసింది. నిందితుడు ప్లాన్ ప్రకారం ఇటువంటి నేరాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. మొబైల్ లొకేషన్ ద్వారా సైబర్ కేటుగాన్ని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. ఇలాంటి హాస్టల్ మోసాలు సిటీల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. డబ్బుకు కక్కుర్తి పడే హాస్టళ్ల నిర్వాహకులు ఎలాంటి ఐడీ కార్డులూ తీసుకోకుండా హాస్టళ్లలోకి ఇలాంటి నేరస్తులను రానివ్వడం వల్ల చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు లక్షల రూపాయల సొమ్ము పోగొట్టుకొని సైబర్ క్రైమ్ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కొన్ని సార్లు నిందితుల్ని పట్టుకుంటున్నా డబ్బు రికవరీ మాత్రం అసాధ్యంగా మారింది. అందుకే ఎప్పుడూ అలర్ట్­గా ఉండటం మన బాధ్యతనని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు