విందుకు వచ్చి..

14 May, 2018 14:32 IST|Sakshi
రాకేష్, సంజీబ్‌ల మావోయిస్టుల మృతదేహం

జవాన్లు, మావోల మధ్య ఎదురు కాల్పులు

ఇద్దరు మావోయిస్టుల మృతి

మల్కన్‌గిరి ఒరిస్సా : విందుకు వచ్చిన మావోయిస్టుల్లో ఇద్దరు ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. ఒడిశా రాష్ట్రం బొలంగీర్‌ జిల్లా కోప్రకోల్‌ సమితి, డుడ్కమాల్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలావున్నాయి. ముందస్తు సమాచారం మేరకు బొలంగీర్‌ ఎస్పీ శివసుబ్రహ్మణ్యం సూచనలతో సీఆర్‌పీఎఫ్, డీబీఎఫ్‌ జవాన్లు బొలంగీర్‌ జిల్లా కోప్రకోల్‌ సమితి, డుడ్కమాల్‌ గ్రామం సమీపంలో శనివారం కూంబింగ్‌కు వెళ్లారు.

అయితే డుడ్కమాల్‌ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన విందుకు మావోయిస్టులు వచ్చారు. ఈ సమయంలో కూంబింగ్‌లో ఉన్న జవాన్లకు మావో కమెండర్స్‌ రాకేష్, సంజీబ్‌లు తారసపడ్డారు. వెంటనే దగ్గర్లో ఉన్న ఇంటిలోకి మావోయిస్టులు వెళ్లిపోయారు. అక్కడ నుంచి జవాన్లపైకి కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు కాల్పులు ప్రారంభించారు. ఇరువురు మధ్య సుమారు గంటపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు రాకేష్, సంజీబ్‌లు మృతి చెందారు.

డివిజినల్‌ కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్న కమెండర్‌ సంజీబ్‌పై ఒడిశా ప్రభుత్వం రూ. 5 లక్షల రివార్డు ప్రకటించింది. సంఘటనా స్థలం నుంచి మావోల మృతదేహాలు, ఏకే 47 గన్, బుల్లెట్లు, ఇతర సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు