కులాంతర వివాహం

29 Jul, 2019 07:06 IST|Sakshi

ప్రియుడి తల్లిదండ్రులకు చిత్రహింసలు

చెన్నై, తిరువొత్తియూరు : కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆగ్రహించిన అమ్మాయి బంధువులు ప్రియుడి కుటుంబాన్ని చెట్టుకు కట్టేసి చిత్ర హింసలకు గురిచేశారు. ఈ ఘటన ధర్మపురి జిల్లా పెన్నగరంలో చోటు చేసుకుంది. చిక్కంపట్టికి చెందిన కాళిదాసన్‌ (48) కుమారుడు అజిత్‌ కుమార్‌ (23)కోవైలోని ఓ కళాశాలలో చదువుతున్నాడు. తాలంపల్లానికి చెందిన రోజా కుమార్తె ప్రియ (22)ను ప్రేమిస్తున్నాడు. వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వారి ప్రేమకు తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో ప్రేమికులిద్దరూ గత నెల ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో ప్రియ బంధువులు కోపోద్రిక్తులు కావడంతో భీతి చెందిన అజిత్‌ తల్లిదండ్రులు కాళిదాసన్, విద్య, చెల్లెలు చిన్నక్క, తమ్ముడు హరిహరన్, అతని కుమారుడు మంజునాథ్, బంధువులు సెల్వం, కృష్ణమూర్తి, హరిహరన్‌ ఊరు వదలి బెంగళూరులో ఉన్న బంధువు ఇంటికి వెళ్లి తల దాచుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న రోజా, కుటుంబ సభ్యులు వారికి నచ్చజెప్పి కారులో బెంగుళూరు నుంచి తాలంపల్లం గ్రామానికి తీసుకొచ్చారు. ఊరి మధ్యలో ఉన్న చింత చెట్టుకు కట్టి చిత్ర హింసలు పెట్టారు. మహిళలు అని చూడకుండా దాడి చేశారు. నాలుగు రోజులుగా ఓ ఇంటిలో బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. అనంతరం హోసురుకు తీసుకొచ్చి వదిలిపెట్టారు. వారం లోగా ప్రియ, కుమార్‌ను తమకు అప్పగించాలని హెచ్చరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసు సూపరింటెండెంట్‌ రాజన్‌ ఆదేశాల మేరకు పోలీసులు తాలంపల్లంలో మకాం వేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు