వివాహేతర సంబంధం వద్దన్నందుకు అత్త,మామ హత్య

26 Dec, 2018 09:52 IST|Sakshi

తిరువొత్తియూరు: వివాహేతర సంబంధం వద్దని సక్రమంగా కాపురం చేయమని అల్లుడిని మందలించిన దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. విరుదునగర్‌ జిల్లా నరికుడి వీర చోళన్‌ గ్రామం సమీపం కీళ చెంబూర్‌కు చెందిన పాండి రైతు. అతని కుమారుడు గణేషన్‌ (25) కూలీ. అతనికి వీరచోళన్‌ గ్రామానికి చెందిన సెంథిల్‌వేల్‌ కుమార్తె మునీశ్వరి (24)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒకటిన్నర సంవత్సరం వయసున్న శక్తివేల్‌ అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో గణేశన్‌కు అదే ప్రాంతానికి చెందిన తమిళరసి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం అతని భార్య మునీశ్వరికి తెలిసింది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది.

ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మునీశ్వరి తండ్రి సెంథిల్‌వేల్‌ (45), తల్లి వనిత (40). కీళ చెంబూరులో ఉన్న గణేషన్‌ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో భార్యతో గొడవ పడుతున్న అల్లుడిని వివాహేతర సంబంధం వదులుకుని సక్రమంగా కాపురం చేయాలని మందలించారు. ఓ దశలో వారి మధ్య వాగ్వాదం నెలకొనడంతో ఆగ్రహించిన గణేశన్‌ అతని తండ్రి పాండి (48) కలిసి సెంథిల్‌వేల్‌ను, అతని భార్యపై కత్తులతో దాడి చేశారు. దాడిలో దంపతులు ఇద్దరు మృతి చెందారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న విరుదునగర్‌ ఎస్పీ రాజరాజన్‌ సంఘటన స్థలం వద్దకు చేరుకుని విచారణ చేసి సెంథిల్‌వేల్, వనిత మృతదేహాలను శవపరీక్ష కోసం తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న తండ్రి, కుమారుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు