చదివేది ఎంసీఏ.. చేసేది చైన్‌స్నాచింగ్‌

4 Nov, 2017 02:48 IST|Sakshi

ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్టు

ధర్మవరం అర్బన్‌: ఉన్నత చదువులు చదివిన ఇద్దరు యువకులు చెడువ్యసనాలకు బానిసయ్యారు. జల్సాలకు అవసరమైన డబ్బు కోసం చైన్‌స్నాచర్లుగా మారారు. బాధితుల బంధువుల చేతికి చిక్కి.. కటకటాలపాలయ్యారు. ఇద్దరు చైన్‌స్నాచర్లను ధర్మవరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం పట్టణ పోలీసుస్టేషన్‌లో సీఐ హరినాథ్‌ మీడియాకు వెల్లడించారు. అనంతపురానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి, ఖాజామోద్దీన్‌లు ఓ ప్రైవేటు కళాశాలలో ఎంసీఏ చదువుతున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ యువకులు కళాశాలకు వెళ్లకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా రూ.2 లక్షలు విలువ చేసే ద్విచక్రవాహనంలో అక్టోబర్‌ 21న ధర్మవరం వచ్చారు. పట్టణంలో వెళుతున్న రేగాటిపల్లి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే వివాహిత మెడలో బంగారు తాళిబొట్టు, గొలుసును లాక్కెళ్లారు.

అప్రమత్తమైన బాధితురాలు బంధువులకు సమాచారం చేరవేసింది. బైక్‌పై దూసుకెళుతున్న ఆ యువకులను కేతిరెడ్డి కాలనీ సమీపంలో బాధితురాలు బంధువులు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చైన్‌ స్నాచర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా  మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించారని సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ జయానాయక్, హెడ్‌కానిస్టేబుల్‌ డోనాసింగ్, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, షాకీర్‌హుస్సేన్, ప్రసాద్, శ్రీరాములు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు