ఆలస్యంగా వెలుగు చూసిన వైనం
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి మాధవధార ప్రశాంతి టవర్స్ ప్రాంతంలో బాలునిపై విషప్రయోగం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాధవదార ప్రశాంతి టవర్స్లో సురేంద్రనాథ్ కుటుం బంతో నివాసముంటున్నారు. ఈ నెల 4న ఎదురు ఫ్లాట్లో ఉంటున్న హారతి అనే యువతి వద్దకు సురేంద్రనాథ్ కుమారుడు కార్తికే య శ్రీమాన్(3) వెళ్లాడు. అనంతరం కొద్దిసేపటికే వాంతులు చేసుకుంటూ తిరిగి ఇంటికి వచ్చాడు. ఏం జరిగిందని అడిగితే ఆంటీ తన నోట్లో ఏదో వేసిందని చెప్పాడు. పరిస్థితి గమనించి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉంది. దీనిపై ఈ నెల 5న బాలుడి తండ్రి ఎం.సురేంద్రనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే హారతి తండ్రి ఇటీవలే మృతి చెందాడు. అప్పటి నుంచి హారతి మతిస్థిమితం లేని విధంగా ప్రవర్తిస్తుందని చెబుతున్నారు. హారతి ఇంట్లో తల్లి, అన్నయ్య ఉన్నారు.