వ్యభిచార మహిళకు బెదిరింపులు

13 May, 2019 12:17 IST|Sakshi

ఇద్దరు పోలీసులు సహా ముగ్గురు అరెస్టు

టీ.నగర్‌: వ్యభిచార మహిళను బెదిరించి నగలు అపహరించిన సాయుధ దళ పోలీసులు సహా ముగ్గురిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పూందమల్లికి చెందిన నిషా (29) శనివారం బస్టాండు సమీపంలో రోడ్డుపై వెళుతుండగా ఆమెను అటకాయించిన ముగ్గురు యువకులు నిషా వద్ద వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో వాగ్వాదం పెరగడంతో ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో నిషా ప్రజల సహకారంతో ముగ్గురిని పట్టుకుని, పూందమల్లి పోలీసులకు సమాచారం తెలిపింది. ఆ సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. ఇందులో చార్లెస్‌ వేలాంకని (30), మోహన్‌ (28) సాయుధ పోలీసు దళంలో పని చేస్తున్నట్లు తెలిసింది.

వారితో పాటు వచ్చిన స్నేహితుడు రాజశేఖరన్‌ (29)గా గుర్తించారు. స్నేహితులైన ఈ ముగ్గురు కొన్ని నెలల క్రితం బ్రోకర్‌ను కలుసుకుని వ్యభిచారానికి మహిళ కావాలని కోరారు. అందుకు అడ్వాన్సుగా రూ. 20 వేలు బ్రోకర్‌ తెలిపిన బ్యాంకు అకౌంట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా పంపారు. ఆ తర్వాత నిషా సెల్‌ఫోన్‌ నెంబరు స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. రెండు నెలల తర్వాత సెల్‌ఫోన్‌ ఆన్‌ అయింది. సెల్‌ఫోన్‌ నెంబర్‌తో అడ్రస్‌ తెలుసుకుని గత వారం నిషా ఇంటికి వెళ్లారు. తాము పోలీసులమని, తమనే మోసగిస్తావా అని నిషాని బెదిరించి ఆమె ధరించి ఉన్న మూడు సవర్ల గొలుసుని తెంపుకుని పరారైనట్లు విచారణలో తేలింది. ఇలా ఉండగా ముగ్గురిని నిషా పూందమల్లిలో చూసింది. ఆ తర్వాత ప్రజల సహకారంతో వారిని పోలీసులకు అప్పగించినట్లు విచారణలో తెలిసింది. దీని గురించి కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు