బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి దారుణహత్య

17 Dec, 2017 11:13 IST|Sakshi

సాక్షి, లక్నో: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ ప్రకాశ్ తివారీ (గిప్పీ తివారీ) కుమారుడు వైభవ్ తివారీ(36)ని ఓ గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి సమీపంలోని కస్మాండా హౌస్‌లో శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది.

లక్నో జోన్ ఏడీజీ అభయ్ ప్రసాద్ కథనం ప్రకారం.. వైభవ్ తివారీ ఐఐఎం అహ్మదాబాద్‌ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందాక వ్యాపారం ప్రారంభించాడు. సూరజ్ అనే పార్ట్‌నర్‌తో కలిసి కొన్నేళ్లపాటు బిజినెస్ చేసిన అనంతరం వీరిద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో వీరు వేర్వేరుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే సూరజ్ మాత్రం వైభవ్‌పై గత కొంతకాలం నుంచి పగతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి యూపీ అసెంబ్లీ సమీపంలోని వైభవ్ నివాసం కస్మాండా హౌస్‌కు గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో వైభవ్‌పై కాల్పులకు తెగబడి అతడిని హత్యచేశాడు. సూరజ్ ఈ పని చేసినట్లు వైభవ్ ఇంట్లో పనివాళ్లు చెబుతున్నారు. నిందితుడు వైభవ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు లక్నో జోన్ ఏడీజీ అభయ్ ప్రసాద్ వివరించారు.  

గిప్పీ తివారీకి ఏకైక సంతానం వైభవ్ తివారీ. వైభవ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా, గిప్పీ తివారీ 1989, 1991, 1993లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దొమారియాగంజ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2014లో సమాజ్‌వాదీ పార్టీలో చేరిన గిప్పీ తివారీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు