తండ్రి చేతిలో కొడుకు హతం

14 Nov, 2019 07:55 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకటరమణ, సీఐ కిషోర్‌, జలేందర్‌ మృతదేహం

సాక్షి, పెగడపల్లి(కరీంనగర్‌) : కుటుంబకలహాల కారణంగా అల్లారుముద్దుగా పెంచీ పెద్ద చేసిన తండ్రి.. కొడుకునే అంతమొందించిన సంఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటన స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, మల్యాల సీఐ కిషోర్‌ సందర్శించారు. మృతుడి తల్లి గంగవ్వ, డీఎస్పీ  వివరాల మేరకు..దోమలకుంటకి చెందిన నక్క రమేశ్‌–గంగవ్వ దంపతులకు కుమారుడు జలేందర్‌(21), కూతురు స్నేహ ఉన్నారు. ఉపాధి నిమిత్తం రమేశ్‌ కొన్నేళ్లపాటు దుబాయి వెళ్లి ఇటీవల తిరిగొచ్చాడు. కొద్దిరోజుల నుంచి భార్యభర్తలు రమేశ్,గంగవ్వ మధ్య డబ్బు విషయమై గొడవలు జరుగుతున్నాయి. దుబాయ్‌లో సంపాదించిన డబ్బు తనకు ఇవ్వకుండా తల్లిదండ్రులు, ఆడబిడ్డకు పంపించాడనే కారణంతో గొడవలు తీవ్రమయ్యాయి. కొద్దిరోజులక్రితం నుంచి రమేశ్‌ తన తల్లి కొమురవ్వ, తండ్రి రాయమల్లు వద్ద ఉంటున్నాడు.

బుధవారం ఉదయం రమేశ్‌ పనులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా కొడుకు జలేందర్, భార్య గంగవ్వ డబ్బు విషయమై గొడవపడ్డారు. ఈ క్రమంలో  రమేశ్, తన తండ్రి రాయమల్లు సహకారంతో కత్తితో జలేందర్‌ను కడుపు, చాతిపై పొడిచి గొడ్డలితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడిక్కడే మృతిచెందాడు. అడ్డుగా వచ్చిన భార్య గంగవ్వ కుడివైపు పొత్తి కడుపుపై కత్తిగాటు చేయడంతో తీవ్రగాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నక్క రమేశ్‌ పరారీలో ఉన్నాడు. సీఐ కిషోర్‌ ఆధ్వర్యంలో  రమేశ్, ఆయనకు సహకరించిన జలేందర్‌ తాత రాయమల్లుపై కేసు నమోదు చేసి అయిందని డీఎస్పీ తెలిపారు.  పెగడపల్లి ఎస్సై జీవన్‌ వారి వెంట ఉన్నారు. కాగా మృతుడి తల్లి గంగవ్వ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిం దితులపై సెక్షన్‌ 303, 307ఆర్‌/విత్‌ 109, 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అడిషనల్‌ ఎస్పీ దక్షిణమూర్తి పరిశీలించారు. హత్యకు దారి తీసిన కారణాలు పోలీసుల ద్వారా తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు