విద్యార్థిని ఆత్మహత్య

31 Aug, 2018 00:46 IST|Sakshi

ఆలేరు: ఓ యువతి.. ఒక యువకుడితో మాట్లాడుతుండగా బంధువయ్యే మరో యువకుడు ఫొటోలు తీశాడు. అంతటితో ఆగకుండా వాట్సాప్‌లో పెట్టాడు. దీనికితోడు బంధువుల సూటిపోటి మాటలతో మనస్తాపానికి గురై ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాదపాక కావ్య (17) ఆలేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది.

అదే గ్రామంలో ఇంటి పక్కన ఉండే బంధువయ్యే గ్యాదపాక పవన్‌ కూడా ఇదే కళాశాలలో చదువుకుంటున్నాడు. 10 రోజుల క్రితం కావ్య తన క్లాస్‌మేట్‌తో మాట్లాడుతుండగా.. పవన్‌ ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టాడు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఈనెల 24న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని పెద్దలు హెచ్చరించడంతో పవన్‌ క్షమాపణ చెప్పాడు.

అయితే ఈ విషయంలో పవన్‌ తల్లిదండ్రులు కావ్యను పలుమార్లు సూటిపోటి మాటలతో నిందించారు. దీంతో మనస్తాపానికి గురైన కావ్య బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగింది. విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కావ్య గురువారం ఉదయం మృతి చెందింది. స్థానిక ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు