పొట్టకూటి కోసం వచ్చి.. పరలోకానికి!

19 Mar, 2019 14:03 IST|Sakshi

సాక్షి, రాజాపూర్‌ (జడ్చర్ల): పొట్ట కూటి కోసం సొంత ఊరుని వదిలి వచ్చిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ యాదయ్య కథనం ప్రకారం.. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన దిలీప్‌కుమార్‌సా(22), జితేందర్‌కుమార్‌(27)తో పాటు మరో ఐదుగురు యువకులు కేరళ రాష్ట్రంలోని ఏర్నాకులంలో కేబుల్‌ పనులు చేసేందుకు హైదరాబాద్‌ నుంచి ఆదివారం రాత్రి 10 గంటలకు ఇన్నోవా వాహనంలో బయలుదేరారు.
 
దిలీప్‌కుమార్, జితేందర్‌కుమార్‌ మృతదేహాలు 

అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం రంగారెడ్డిగూడ శివారులో అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కుడిపక్క టైర్‌ పంక్చర్‌ కావడంతో దిలీప్‌కుమార్, జితేందర్‌కుమార్‌ కిందకి దిగి మరో టైర్‌ మార్చుతుండగా హైదరాబాద్‌ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిలీప్‌కుమార్‌కు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందిగా.. జితేందర్‌కుమార్‌ను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. దీంతో మృతదేహాలను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు ఇన్నోవా వాహనం డ్రైవర్‌ ఇంతియాజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. 

 

మరిన్ని వార్తలు