న్యూఢిల్లీ : మద్యం మత్తులో వాహనం నడిపి ఓ యువతి .... ఇద్దరు యువకుల మరణానికి కారణమయింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు మరో ఇద్దరు యువతులు కూడా గాయపడ్డారు. వాయువ్య ఢిల్లీలోని ముఖర్జీనగర్లో ఆదివారం తెల్లవారు జామున 2.45 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.
నోయిడాలోని అమేథీ యూనివర్సిటీలో జరిగిన ఫెస్ట్లో పాల్గొన ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు, కారులో ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు. కారు ఉడ్సన్ లైన్లోని సెంట్రల్ వెర్జ్కు చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి, పక్కనే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పోల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మరణించగా, గాయపడిన ముగ్గురు యువతుల్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారు అధిక వేగంతో ప్రయాణించడంతో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. యువతి మద్యం సేవించి వాహనం నడపటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకులను రితేశ్, సిదార్థ్లుగా గుర్తించారు. ఇద్దరు మృతికి కారణమైన యువతిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.