వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను...

23 Dec, 2018 10:25 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీఐ కిషన్‌

మహబూబ్‌నగర్‌ క్రైం: మహిళను చీర కొంగుతో బిగించి హత్యచేసిన సంఘటనకు సంబంధించిన కేసును పోలీసులు పది రోజుల్లో ఛేదించారు. సోమవారం సీఐ కిషన్‌ నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. నవాబ్‌పేట మండలం కన్మన్‌కాల్వ గ్రామానికి చెందిన భీమమ్మ(35) భర్త గతంలోనే వదిలేయడంతో కొన్నిరోజులుగా తంగెడపల్లికి చెందిన ముర్గని శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల భీమమ్మ ఇతరులతో తిరుగుతోందని  శ్రీనివాస్‌కు అనుమానం రావడంతో అప్పటినుంచి ఆమె తరచూ డబ్బుల కోసం వేధిస్తుండేది. అయితే అది సహించని శ్రీనివాస్‌ ఆమెను తుదముట్టించాలని ప్లాన్‌ వేశాడు.

అందులో భాగంగానే ఈనెల 11న సాయంత్రం 5గంటల సమయంలో నవాబ్‌పేటలో ఉన్న బేకరి దగ్గర కలిశాడు. చీకటి పడిన తర్వాత భీమమ్మకు కల్లు తాగించి నవాబ్‌పేట సమీపంలోని నల్లరాళ్లగుట్ట వద్దకు తీసుకువెళ్లి అక్కడ ఆమె గొంతుకు చీర కొంగు బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు కమ్మలు, తాళిబొట్టు, సెల్‌ఫోన్‌ తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టగా శ్రీనివాస్‌ను పిలిపించి విచారించారు. దీంతో తానే హత్యచేసినట్లు బయటపడింది. అతని వద్ద ఉన్న ఆభరణాలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ ఎస్‌ఐ శివకుమార్, కానిస్టేబుళ్లు వెంకటయ్య, గొవింద్, శంకర్‌లను అభినందించారు.

మరిన్ని వార్తలు