మైసూరులో దారుణం, యువతిపై గ్యాంగ్‌ రేప్‌

10 May, 2019 09:03 IST|Sakshi

ప్రేమజంటపై దాడి చేసి ఘాతుకానికి ఒడిగట్టిన నలుగురు యువకులు..

సాక్షి, మైసూరు: ఓ ప్రేమ జంటపై నలుగురు యువకులు దాడిచేసి.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన బుధవారం రాత్రి పర్యాటక నగరం మైసూరులో జరిగింది. మైసూరు జిల్లాలోని హెచ్‌డీ.కోటె హ్యాండ్‌ పోస్ట్‌ ప్రాంతానికి చెందిన శివసిద్ధు, అతని ప్రియురాలు కలిసి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో మైసూరు సమీపంలో ఉన్న లింగాంబుధి చెరువు రింగ్‌ రోడ్డు వద్ద మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో నలుగురు యువకులు వచ్చి వారిపై దాడి చేశారు. శివసిద్ధు కాళ్ల మీద పెద్ద బండరాయి వెయ్యడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం వారు యువతిపై మూకుమ్మడిగా అత్యాచారం చేసి పరారయ్యారు. కొంతసేపటికి శివసిద్ధు తేరుకుని యువతిని తీసుకుని మైసూరులోని చెలువాంబ ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్నారు. యువకుడికి కాలితో పాటు తలకూ గాయాలయ్యాయి. యువతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.

ఎనిమిది పోలీస్‌ బృందాల ఏర్పాటు
విషయం తెలుసుకున్న మైసూరు జిల్లా ఎస్పీ అమిత్‌సింగ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం బాధితులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గురువారం మీడియాతో మాట్లాడుతూ జయపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని.. దుండగుల కోసం 8 పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వివరించారు.  

మరిన్ని వార్తలు