అనుమాన పిశాచి భర్త

13 Mar, 2018 08:15 IST|Sakshi

సాక్షి, కర్ణాటక(బనశంకరి) : కష్టసుఖాల్లో కలకాలం తోడుంటానని తాళికట్టిన భర్తే తన శీలాన్ని శంకించడంతో భార్య మనసు విరిగిపోయింది. ఇటువంటి అనుమానపు పిశాచితో కాపురం చేయలేనని ఏకంగా ప్రాణాలే తీసుకుంది. వివాహేతర సంబంధం ఉందని భర్త నిత్యం అనుమానిస్తుండడంతో ఆవేదన చెందిన మహిళా ఐటీ ఇంజినీరు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చెన్నమ్మకెరె అచ్చుకట్టుపోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... భువనేశ్వరినగరలో విజయ్‌కిరణ్, తులసి (30) అనే దంపతులు నివాసముంటున్నారు. తులసి నగరంలోని విప్రో కంపెనీలో టెక్కీగా పనిచేస్తోంది. విజయ్‌కిరణ్‌ నిత్యం భార్య ప్రవర్తన పట్ల అనుమానం వ్యక్తం చేసేవాడు. ఈ విషయంలో భార్యభర్తలిద్దరూ పలుమార్లు గొడవపడ్డారు. ఆదివారం రాత్రి కూడా ఇదే మాదిరి గలాటా పడ్డారు. భర్త ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురైన తులసి ఇంట్లో తన గదిలోకి వెళ్లి గడియ వేసుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. విజయ్‌కిరణ్‌ గది తలుపు బద్దలు కొట్టి తులసిని కిందికి దించి స్ధానిక యోగానంద ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెను పరిశీలించి మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు