ఈవెంట్‌ యాంకర్లతో అర్ధరాత్రి అసభ్య నృత్యాలు!

19 Jul, 2018 09:56 IST|Sakshi
ఆలీవ్‌ ట్రీ హోటల్‌.. పక్కన ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ భవానీపురంలో హోటల్‌పై పోలీసుల దాడి

అధికార పార్టీ నేత అనుచరుడి పార్టీ..

సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మద్యం, కండోమ్ ప్యాకెట్లు

సాక్షి, విజయవాడ : నగరంలోని భవానీపురంలో ఉన్న ఆలీవ్ ట్రీ హోటల్‌పై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్‌ చేసి.. ఐదుగురు మహిళలు, 50మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత ముఖ్య అనుచరుడి ఆధ్వర్యంలో హోటల్‌లో ఈ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన కొందరు ప్రైవేట్ ఈవెంట్ యాంకర్లను తీసుకువచ్చి హోటల్‌లో అసభ్య నృత్యాలు నిర్వహించారని సమాచారం. పోలీసుల దాడిలో మరో ఐదుగురు యాంకర్లని తప్పించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో పట్టుబడిన వారిలో 10 మందిని వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌కు, 15 మందిని భవానీపురం పీఎస్‌కు, 10 మందిని ఇబ్రహీంపట్నం పీఎస్‌కు, మరో పదిమందిని గవర్నర్‌పేట పీఎస్‌కు తరలించారు.
ఐదుగురు యువతులను వాసవ్య మహిళా మండలికి అప్పగించారు. పట్టుబడిన యువతులు హైదరాబాద్, భీమవరం, విహయవాడకు చెందిన వారిగా గుర్తించారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబ సభ్యుడు కూడా ఈ  పార్టీలో పాల్గొన్నాడని, అయితే, పోలీసుల రైడ్‌ నుంచి అతన్ని తప్పించారని తెలుస్తోంది. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున మద్యం, కండోమ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ప్రతినెలా ఇదే తరహాలో నగరంలో పార్టీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నగరంలో తొలి ముజ్రా పార్టీ కేసు!
అమ్మాయిల అసభ్య నృత్యాల నేపథ్యంలో నగరంలో మొదటిసారి ముజ్రా పార్టీ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ ముజ్రా పార్టీకి సంబంధించి 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా తెలిపారు. హోటల్ నిర్వాహకులపైనా కేసు పెట్టామని చెప్పారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 లక్షల వరకు నిర్వాహకులు ఈ పార్టీ కోసం వసూలు చేశారని తెలిపారు. పోలీసుల దాడిలో దొరికిన ఐదుగురు అమ్మాయిలను వాసవ్య మహిళా మండలి సంరక్షణలో పెట్టామని చెప్పారు. ఇకపై నగరంలో ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు