-

‘నామాల’ నివారణతోనే దిగుబడి

29 Aug, 2017 22:24 IST|Sakshi
‘నామాల’ నివారణతోనే దిగుబడి

ఆముదంలో సమగ్ర సస్యరక్షణ తప్పనిసరి
కళ్యాణదుర్గం కేవీకే కోఆర్డినేటర్‌ జాన్‌సుధీర్‌


అనంతపురం అగ్రికల్చర్‌: ఇపుడు కురుస్తున్న వర్షాలకు ఆముదం పంట ఆశాజనకంగా ఉన్నందున మంచి దిగుబడుల కోసం సమగ్ర పోషక, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్‌ రాజేష్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 20 మండలాల్లో కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో మరో 15 మండలాల్లో కొంత విస్తీర్ణంలో ఆముదం పంట వేశారన్నారు. మొత్తమ్మీద చూస్తే జిల్లాలో దాదాపు 14 వేల హెక్టార్లలో ఆముదం పంట సాగులో ఉందని తెలిపారు.

పోషక, సస్యరక్షణ చర్యలు
జూన్, జూలైలో వేసిన ఆముదం పంటకు ఇటీవల కురిసిన తేమను ఉపయోగించుకుని ఎకరాకు 25 కిలోల యూరియా చెట్ల మొదళ్ల దగ్గర పైపాటుగా వేసుకోవాలి. దీంతో చెట్లు ఏపుగా పెరగడంతో పాటు దిగుబడి పెరుగుతుంది. పొలంలో వరుసల వెంబడి తల్లిచాలు (గొడ్డుచాలు) దున్నుకుంటే తేమ శాతాన్ని పెంచుకోవచ్చు. ఈ సమయంలో లద్దె పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగులు తొలిదశలో ఆకులను గీకి తర్వాత దశలో రంధ్రాలు ఏర్పాటు చేసుకుని తింటాయి. పెరిగిన లద్దె పురుగులు భూమిలో లేదంటే కింద పడిన ఆకుల్లో ముడుచుకుని కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి.

సెప్టెంబర్‌ నెలలో ఎకరాకు 50 వేల ట్రైకోగ్రామా పరాన్న జీవులు పొలంలో వదిలితే నామాల పురుగు ఉనికి, ఉధృతిని నివారించుకోవచ్చు. నామాల పురుగుల నివారణకు మొదటి దశలో 5 మి.లీ వేపనూనె లేదా 1.5 గ్రాములు అసిఫేట్‌ లేదా 2 మి.లీ ప్రొపినోఫాస్‌ లేదా 1 మి.లీ నొవాల్యురాన్‌ లేదా 1.5 గ్రాములు థయోడికార్బ్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగులు పెద్దవైనపుడు వాటిని ఏరి నాశనం చేసుకోవాలి. ఎకరా పొలంలో 10 వరకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే పక్షులు వచ్చి పురుగులు తినేస్తాయి. పంట కోత తర్వాత పొలంలో చెత్తను కాల్చివేస్తే కోశస్థదశలో ఉన్న నామాల పురుగులను నివారించుకోవచ్చు. 

మరిన్ని వార్తలు