బంతి కోసం వెళ్లి.. బావిలో పడ్డాడు

3 May, 2016 21:18 IST|Sakshi

భువనగిరి అర్బన్(నల్లగొండ): క్రికెట్ బంతి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిన బాలుడిని పోలీసులు రక్షించారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం ప్రగతికాలనీలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బద్దునాయక్, మీర దంపతుల కుమారుడు రజినీకాంత్(16) మంగళవారం సాయంత్రం కాలనీలోని ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. తోటి ఆటగాడు కొట్టిన బంతిని తీసుకువచ్చేందుకు పక్కనే ఉన్న పాడుబావి వద్దకు పరుగు తీసిన రజినీకాంత్ బావిపై వేసిన రేకులపై కాలుపెట్టటంతో అవి విరిగి అందులో పడిపోయాడు. దాదాపు 35 అడుగుల లోతు ఉన్న బావిలో నీరులేదు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నారు. క్రేన్‌ను తెప్పించి బాలుడిని బయటకు సురక్షితంగా తీశారు. రజినీకాంత్ కాళ్లు, చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అతడు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు