ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడతాం

5 Jul, 2016 08:53 IST|Sakshi

* జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కందుల దుర్గేష్
* ‘బాబు’ ఒక్క హామీనీ నెరవేర్చలేదని ధ్వజం

రావులపాలెం : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కార్యాచరణ రూపొందించినట్టు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం రావులపాలెం సీఆర్‌సీ ఆడిటోరియంలో జిల్లా పార్టీ సమావేశం దుర్గేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోనసీమలో రైతులు పంట విరామానికి సిద్ధమవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.  

అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలిచ్చిన  చంద్రబాబు ఏ ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. ఎస్సీలు, బీసీలు, మహిళలు, మైనార్టీలు, రైతులు, చేనేతకార్మికులు, కాపులు.. ఇలా అందరినీ సర్కారు మోసగించిందని, ఇచ్చిన హామీల అమలుకు శాంతియుతంగా ఆందోళనలు చేస్తే పోలీసులతో అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ మూసివేత యత్నాన్ని తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. ఆదివాసీల సమస్యలపై రంపచోడవరం కేంద్రంగా ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు.

నెలకో ఆందోళన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. పార్టీకి పూర్వ వైభవం తేచ్చేందుకు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, బీసీ సెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు జిత్ మోహన్‌మిత్రా తదితరులు మాట్లాడారు. అనంతరం కొత్తగా జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన నాయకులకు దుర్గేష్ నియామక పత్రాలందజేశారు.
 
పింగళి, అల్లూరి, రంగాలకు నివాళి
తొలుత జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు, అల్లూరి సీతారామరాజు, వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆకుల రామకృష్ణ తండ్రి ఆదినారాయణమూర్తి మృతికి సంతాపం తెలిపారు. పీసీసీ ప్రధాన కార్యద ర్శి ఎస్‌ఎన్ రాజా, శిక్షణా తరగతుల చైర్మన్ రామినీడి మురళి, పీసీసీ జాయింట్ సెక్రటరీ పొనుగుపాటి శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, ఎస్సీ సెల్ కన్వీనర్ వర్థినీడి సుజాత, జిల్లా ప్రధాన కార్యదర్శి సాధనాల శ్రీని వాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాశీ లక్ష్మణస్వామి, కార్యదర్శి బీవీవీ లక్ష్మీ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు