బోరు సీజ్‌ చేస్తున్నారని రైతు ఆత్మహత్యాయత్నం

27 Apr, 2017 01:01 IST|Sakshi
పుట్లూరు(శింగనమల): పుట్లూరు చెరువులో పెద్దిరెడ్డి అనే రైతు బుధవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా, బోరు వేయడంతో తహసీల్దార్‌ రామచంద్రారెడ్డి తమ సిబ్బందితో వెళ్లి సీజ్‌ చేసేందుకు ప్రయత్నించడంతో మనస్తాపానికి గురైన సదరు రైతు ఈ చర్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు, తోటి రైతుల కథనం మేరకు.. పుట్లూరు చెరువులో రైతులు అక్రమంగా బోరుబావులను తవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలు గ్రామాల ప్రజలు తహసీల్దార్‌కు మార్చి 6న ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన అదే నెల 24న బోరుబావులను సీజ్‌ చేశారు. దీనిపై పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించి యధాస్థితిని కొనసాగించాలంటూ ఉత్తర్వులు తెచ్చుకున్నారన్నారు.

ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి బోరుబావిని సీజ్‌ చేసేందుకు రెవెన్యూ అధికారులు బుధవారం వెళ్లారు. విద్యుత్‌ మోటర్‌ను తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో అవమానంగా భావించిన రైతు.. దానిమ్మ తోటలో దాచి ఉంచిన పురుగుల తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై తహసీల్దార్‌ రామచంద్రారెడ్డిని వివరణ కోరగా.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పుట్లూరు చెరువులో 30 బోరుబావులను సీజ్‌ చేశామన్నారు. అందులో పెద్దిరెడ్డి అనే రైతు బోరు కూడా ఉండగా, ఆయన కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నట్లు వివరించారు. సీజ్‌ చేసిన బోరుబావులను బ్రేక్‌ చేసి విద్యుత్‌ మోటర్లను దింపారని తెలిపారు.
మరిన్ని వార్తలు